|| దృశ్యం న్యూస్ ||
సిరికొండ, నిజామాబాద్ జిల్లా: సిరికొండ మండలం రావుట్ల గ్రామ శివారులోని రిజర్వ్ ఫారెస్ట్ భూములను కొందరు వ్యక్తులు పోడు సాగు పేరుతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టి, అడవి భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు అందచేశారు.
గ్రామస్థుల కథనం ప్రకారం, రావుట్ల గ్రామ పరిధిలోని అటవీ భూముల్లో చెట్లను నరికి వ్యవసాయ సాగుకు సిద్ధం చేస్తున్నారని, ఈ విషయంపై పలుమార్లు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అటవీ శాఖ అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. త్వరలో అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల సంయుక్త బృందంతో సర్వే నిర్వహించి, అక్రమ ఆక్రమణలను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.








