|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో నెలవారీ క్రైమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పెండింగ్ కేసుల పరిష్కారం, రోడ్డు ప్రమాదాల నివారణ, నేర నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొత్త కేసులతో పాటు పురాతన కేసుల పరిశీలన కొనసాగించాలని సూచించారు. కేసుల నిరంతర సమీక్ష, సమర్థవంతమైన పర్యవేక్షణ ద్వారా పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి వ్యాపారస్తులకు, ప్రజలకు అవగాహన కల్పించాలి. రాత్రి సమయంలో గస్తీ బృందాలు పెంచి పెట్రోలింగ్ను మెరుగుపరచాలని,100 కాల్కు తక్షణ స్పందన ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ మహేందర్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, తూప్రాన్ డీఎస్పీ వెంకట రెడ్డి, రామయంపేట్ సీఐ వెంకట రాజ గౌడ్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, తూప్రాన్ సీఐ రంగ కృష్ణ, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ మధుసూదన్ గౌడ్, ఎస్బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








