|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: ఎడపల్లి గ్రామంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. గ్రామంలోని రైతు వేదిక వద్ద గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు స్థానిక ప్రజలు, మహిళలు, చిన్నారులు మరియు వృద్ధులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం వేళల్లో కుక్కల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
ఈ క్రమంలో రైతు వేదికలో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మి అనే మహిళపై ఉదయం సమయంలో వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టి మహిళను ప్రథమ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో వీధి కుక్కల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకుని వీధి కుక్కలను నియంత్రించాలని గ్రామస్థుడైన న్యావానంది శ్రీకాంత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి నాగరాజుకు వినతి పత్రం అందజేసి విజ్ఞప్తి చేశారు.








