|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి గ్రామ పంచాయితీ కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామ యువత భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యం మరియు గ్రామ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ కందగట్ల రాంచందర్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఆమోదంతో రెండు ముఖ్యమైన తీర్మాణాలు ఆమోదించబడ్డాయి.
మొదటి తీర్మాణం ప్రకారం, ఎడపల్లి గ్రామంలో గంజాయి అమ్మకం లేదా వినియోగంపై సమాచారం అందించిన వారికి రూ.10,000 నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
రెండవ తీర్మాణంలో భాగంగా, 18 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు, గుట్కా, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు విక్రయించిన షాపు యజమానులకు రూ.10,000 జరిమానా విధించనున్నారు. ఈ అక్రమాలపై సమాచారం ఇచ్చిన వారికి రూ.5,000 బహుమతి అందజేయనున్నారు.
“డ్రగ్స్ కేవలం అలవాటు కాదు.. జీవితాన్ని నాశనం చేసే ప్రమాదకర వ్యసనం” అని గ్రామ పంచాయితీ హెచ్చరించింది. ఈ నిర్ణయాలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.








