|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: రైతులు వారి పంట భూములను సారవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన చెరువుల పూడికతీత కార్యక్రమం కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పదంగా మారుతోంది. సాలూరా మండలంలోని ఓ చెరువులో నల్లమట్టి అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

బహిరంగంగా భారీ యంత్రాల సహాయంతో చెరువులో నుంచి మట్టిని తవ్వి టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున తరలిస్తు, సాధారణంగా చెరువుల పూడికతీత ద్వారా వెలికితీసే సారవంతమైన మట్టిని రైతుల వ్యవసాయ భూములకు మాత్రమే వినియోగించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నీటి పారుదల శాఖ ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది.. అయితే కొందరు ప్రభావశీలులు ఈ అనుమతులను దుర్వినియోగం చేస్తు, చెరువు మట్టిని వ్యవసాయ భూములకు తరలించకుండా వెంచర్లు, ప్లాట్లు, గృహ నిర్మాణ స్థలాలు మరియు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో రైతులకు ఉపయోగపడాల్సిన చెరువు పూడికతీత కార్యక్రమం అసలు లక్ష్యం దెబ్బతింటోందని, ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నత అధికారులు, జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువు మట్టిని ఇతర అవసరాలకు వినియోగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తు, అక్రమ మట్టి తరలింపుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.








