|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం పూర్తిగా రద్దయింది. 03/09/2025న ఎన్నికైన ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు 28/01/2026 బుధవారం రోజున సమావేశమై, ఏకగ్రీవంగా ముకుమ్మడి రాజీనామాలు సమర్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత కమిటీ ఇకపై చెల్లుబాటు కాదని సభ్యులు స్పష్టంగా ప్రకటించారు.
కమిటీ సభ్యులందరూ కలిసి నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు కదం ప్రకాష్ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ, కమిటీ మొత్తాన్ని రద్దు చేయాలనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
కమిటీ సభ్యులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధ్యక్షుడు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, పారదర్శకత లోపించడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణమని సభ్యులు వెల్లడించారు.
రద్దు చేసిన కమిటీతో ఇకపై ఎడపల్లి మండల ప్రెస్ క్లబ్ సభ్యులకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు. జర్నలిస్టుల ఐక్యత, ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక విధానాలకు అనుగుణంగా అధ్యక్షుల ప్రవర్తన లేదని తెలిపారు. ఈ పరిణామం ఎడపల్లి మండల మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








