|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) వ్యవహార శైలిపై ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎడపల్లి మండలంలోని వడ్డెర కాలనీలో గత సోమవారం జరిగిన సంఘటన విద్యా వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ఉందని సంఘాల నేతలు ఆరోపించారు. ఒక ఉపాధ్యాయుడిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం అత్యంత శోచనీయమని, ఇలాంటి విషయాలను పై మొదట అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా వారు పేర్కొన్నారు.
ఎంఈఓ మండలంలోని ఉపాధ్యాయులను మానసికంగా వేధిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సంఘాల సమాఖ్య స్పష్టం చేసింది.
విద్యా వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సంబంధిత ఎంఈఓను వెంటనే హోదా నుంచి తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్ చేస్తూ, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)కి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు పి. మోహన్ రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, బీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు స్వామి నాయక్, టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఆర్యూపీపీ జిల్లా అధ్యక్షులు జమీలుల్లా, ఆర్యూపీటీఎస్ జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. ధర్మేందర్ పాల్గొన్నారు.








