|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కోల్చారం మండలంలోని సంగయ్యపేట గ్రామ పిఎసిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరగేలా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో ఇప్పటివరకు 34,520 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు పూర్తి అయినట్లు కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రిజిస్టర్లు సక్రమంగా నిర్వహిస్తున్నారా, తేమ శాతం నిర్ధారించడంలో ఏవైనా లోపాలున్నాయా అనే అంశాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించి, రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే సీరియల్ నంబర్, తేమ శాతం, ధాన్యం రకం వంటి వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదేవిధంగా నిర్దేశిత తేమ శాతం వచ్చిన వెంటనే మిల్లులకు పంపిణీ చేయాలని, అదనంగా, సన్న రకం, దొడ్డు రకం ధాన్యాల గుర్తింపులో సిబ్బంది అవగాహన పెంపొందించుకోవాలని, వ్యవసాయ శాఖ శిక్షణ పొందిన వారే కొనుగోలు ప్రక్రియలో పాల్గొనాలని స్పష్టం చేశారు.








