|| దృశ్యం న్యూస్ ||
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించబోయే మేరా యువభారత్ మెదక్ కార్యక్రమంను విజయవంతం చేయాలని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమైక్యతకు ప్రతీక అని, పటేల్ విలువలు యువతకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. 530 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని ఏకతా భారతంగా తీర్చిదిద్దిన పటేల్ సేవలను స్మరించారు.
యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు, వృత్తి నైపుణ్యత పెంపొందించడమే మేరా యువభారత్ లక్ష్యమని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని కళాశాలలో వ్యాసరచన, రంగోలి, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని సూచించారు.
అనంతరం మేరా యువభారత్ మెదక్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.








