|| దృశ్యం న్యూస్ ||
హోళీ పండుగను కుటుంబసమేతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు.
ఆరోగ్యకరమైన సంప్రదాయ రంగులను మాత్రమే వినియోగించాలని, హానికరమైన రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరించారు.
హోళీ వేడుకలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జరుపుకోవాలని తెలిపారు. ఇతరుల అనుమతి లేకుండా రంగులు చల్లడం, వాహనాలపై రంగు నీళ్లు పోయడం చట్టపరంగా నేరమని స్పష్టం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించడం, ఇతరులను ఇబ్బందిపెట్టడం సహించబోమని హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని వివరించారు.
బైక్ ర్యాలీలు నిర్వహించవద్దని, రోడ్లపై అల్లరికి పాల్పడకుండా ఉండాలని సూచించారు. హోళీ సందర్భంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సీసీటీవీ నిఘా కొనసాగుతుందని సీపీ తెలిపారు.








