|| దృశ్యం న్యూస్ ||
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహ నిర్మాణాలు వేగంగా, పారదర్శకంగా సాగేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
శుక్రవారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కౌడిపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించి, అధికారులను వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని గుర్తుచేశారు.

లబ్ధిదారుల సందేహాలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు హిమాయత్నగర్లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేయబడింది అని, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీన్ని ప్రారంభించారని తెలిపారు.
1800-599-5991 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫిర్యాదులు స్వీకరించి, వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించే విధానం అమలు చేస్తారు.
అంతేకాకుండా, లబ్ధిదారులు వెబ్సైట్ ద్వారా వారి ఇంటి నిర్మాణ ఫోటోలు అప్లోడ్ చేసి, బిల్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు అని, ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకతతో ఈ పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.








