|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం పరిధిలోని శాటపూర్–బొర్గం గ్రామాల శివారులో కొనసాగుతున్న ఉషశ్రీ విద్యానికేతన్ పాఠశాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజుల వసూళ్ల పేరుతో LKG, UKG, ప్రాథమిక తరగతుల చిన్నారులపై అమానుష శిక్షలు విధిస్తున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులను నిలబెట్టి అవమానించడం, క్రమశిక్షణ పేరుతో మానసిక ఒత్తిడి కలిగించడం వంటి చర్యలు విద్యా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకుల వద్ద సమాధానం తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులకు పాఠశాల వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా దర్శనం ఇచ్చాయి.
భద్రతా ప్రమాణాలు ఎక్కడ?
పాఠశాలలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం మరింత ఆందోళన కలిగించాయి. పగుళ్ల గోడలు ఉన్న తరగతి గదులు, ప్రహరీ గోడ లేకుండా పంట పొలాల మధ్య తరగతుల నిర్వహణతో విషపురుగుల ప్రమాదం, చెత్తతో నిండిన ప్రదేశంలో మధ్యాహ్న భోజన వసతులు, ఇలా చిన్నారుల ఆరోగ్యానికి ముప్పుగా ప్రమాదకరంగా ఉన్నాయి.
పాఠశాల పక్కనే వ్యవసాయ భూములు ఉండటంతో పురుగుమందుల పిచికారీ ప్రభావం విద్యార్థులపై పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 200 మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండటం దారుణం.
సిబ్బందికి అయితే పరధాల మధ్య మరుగుదొడ్లు తాత్కాలిక ఏర్పాట్లు చేయడం పరిస్థితి మరింత దారుణ తీవ్రతను తెలియజేస్తోంది.
భూ వినియోగ అనుమతులపై సందేహాలు:

ఇంకా గంభీర అంశం ఏమిటంటే, పాఠశాల నడుస్తున్న భూమి వ్యవసాయ కేటగిరీలో ఉండి అవసరమైన Land Conversion (NA/CLU) అనుమతులు లేవనే సమాచారం వెలుగులోకి రావడం. చట్టబద్ధ అనుమతులు లేకుండా విద్యాసంస్థను నిర్వహించడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం?
ఫిర్యాదులు వచ్చినప్పుడే చర్యలు తీసుకుంటామని అధికారుల వైఖరి విమర్శలకు గురవుతోంది. సంబంధిత శాఖలు క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
కఠిన చర్యలకు విజ్ఞప్తి:

తక్షణమే ఈ విద్యాసంస్థపై జిల్లా విద్యాశాఖ తక్షణ విచారణ జరిపి, భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాఠశాలల నుండి అప్రమత్తంగా ఉండాలని పలువురు కోరుతూ, చిన్నారుల భద్రత, గౌరవం, ఆరోగ్యం ప్రతి విద్యాసంస్థ యొక్క ప్రాథమిక బాధ్యత అనే విషయం మరవకూడదు అని తెలియచేస్తున్నారు.
పాఠశాలకు కనీస భద్రత, క్రమశిక్షణ, నియమాలు పాటించని నిర్వాహకులు విద్యార్థులు క్రమశిక్షణ పేరుతో దండించడం గమనార్హం.








