|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనను పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ విషయాన్ని టేక్మాల్ ఎస్ఐ అరవింద్ వెల్లడించారు. తంప్లూర్ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును లాగేసి పరారయ్యారు.
బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా దృశ్యాలు మరియు సమగ్ర సమాచారంతో నిందితులైన పాపయ్య, పోచయ్యలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు.
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరుగుతున్నాయని ఎస్ఐ అరవింద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.








