|| దృశ్యం న్యూస్ ||
మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనివల్ల నిజామాబాద్ జిల్లా బోధన్ డివిజన్ పరిధిలోని నవీపేట్ మండలం యంచ గ్రామ సమీపంలో గల బాసర గోదావరి బ్రిడ్జిని, అదేవిధంగా రెంజల్ మండలం కందకుర్తి బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పెరిగింది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఈ ప్రాంతాల్లో వరద పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే 2-3 రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వరద ఉధృతి అధికమయ్యే అవకాశం ఉన్నందున నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది సమీపనికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. అత్యవసర సమయంలో డయల్ 100, పోలీస్ కంట్రోల్ రూమ్ 87126-59700, లేదా నవీపేట్, రెంజల్ పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని సూచించారు. ఈ పర్యటనలో స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








