|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుండి 15 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటికి చట్ట ప్రకారం పరిష్కారం అందిస్తున్నామని ఎస్.పి. తెలిపారు.

ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్ల ఎస్ఐ, సిఐలకు తక్షణ సూచనలు చేశారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మెదక్ జిల్లా పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను పరిరక్షించే దిశగా కృషి చేస్తున్నారని ఎస్.పి. తెలిపారు.








