|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేసిన సామ శ్రీనివాస్ సెలవుపై వెళ్లడంతో, ఆయన స్థానంలో కే. వినయ్ బదిలీపై బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై కే. వినయ్ మాట్లాడుతూ, ధర్పల్లి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. నేటి సమాజంలో యువత భవిష్యత్తు చెడగొట్టే మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
అలాగే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మండలంలో క్రైమ్ రేటు పెరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని, ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తే నేరాల నియంత్రణ మరింత సులభమవుతుందని పేర్కొన్నారు. ధర్పల్లి మండల ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎస్సై కే. వినయ్ విజ్ఞప్తి చేశారు.








