|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఎడపల్లి గ్రామపంచాయతీ పరిధిలో రూర్బన్ పథకం కింద ఏర్పాటు చేసిన సెంటర్ లైటింగ్ గత రెండు సంవత్సరాలుగా సరైన మరమ్మతులు లేక నిర్లక్ష్యానికి గురైందని గ్రామస్థుడు పురం శేఖర్ మండల ఎంపిఓకి ఫిర్యాదు చేశారు. గత కొన్ని నెలలుగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ వెలగకపోవడంతో ఎడపల్లి గ్రామం రాత్రివేళల్లో అంధకారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలో నడిచి వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా, కొన్ని లైటింగ్ స్తంభాలకు సంబంధించిన విద్యుత్ తీగలు బయటకు వచ్చి ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, వర్షాకాలంలో చిన్నపిల్లలు, పశువులు, ప్రజలకు విద్యుత్ ప్రమాద ముప్పు ఉందని హెచ్చరుస్తూ,
ఏదైనా అవాంఛనీయ ఘటన జరగకముందే సెంటర్ లైటింగ్ మరమ్మతులు చేపట్టి, ప్రమాదకర విద్యుత్ వైర్లను తక్షణమే సరిచేయాలని ఎడపల్లి పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని మండల అధికారులను కోరారు.








