|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అత్యవసర మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో పాఠశాలలు, వసతి గృహాల్లోని సమస్యలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలల్లో మరమ్మతులు పగడ్బందీగా చేపట్టాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, రూఫ్ లీకేజీ, ప్లంబింగ్, డోర్లు, విండోస్ మరమ్మతులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలు, వసతి గృహాల భవన యజమానులతో చర్చించి మరమ్మతులు త్వరగా పూర్తి చేయించాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, ఎస్సీ సంక్షేమ అధికారి చంద్రకళ, బీసీ సంక్షేమ అధికారి జగదీష్, సంబంధిత గురుకులాల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.








