|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల పోలీస్ స్టేషన్కు నూతన SHOగా ఎస్సై సోమ శ్రీనివాస్ గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో సోమ శ్రీనివాస్ మాట్లాడుతూ, ధర్పల్లి మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తూ, చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తే, ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 సేవలను వెంటనే వినియోగించుకోవాలని తెలిపారు.
యువత మత్తు పదార్థాలకు బానిసలుకాకుండా తల్లిదండ్రులు, సమాజం సమన్వయంతో చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్పల్లి మండల ప్రజలు పోలీస్ శాఖకు సహకరిస్తూ శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని నూతన SHO సోమ శ్రీనివాస్ స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు.








